- మంత్రి వివేక్ వెంకటస్వామి
- జర్మన్ భాష, ఏఐ నైపుణ్యాలతో యువతకు విదేశాల్లో అవకాశాలు
తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. టామ్కామ్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఇందుకోసం బడ్జెట్లో రూ.90 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
హైదరాబాద్, సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో భారత్–యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, యూరోపియన్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా–ఈయూ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఫేజ్–2లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. టామ్కామ్ సహకారంతో ఈ వర్క్షాప్ను ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టామ్కామ్ ఒక అద్భుతమైన సంస్థగా ఎదిగిందన్నారు. టామ్కామ్ ద్వారా శిక్షణ పొందిన యువత విదేశాల్లో మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా జర్మన్ భాష నేర్చుకున్న వారికి యూరోపియన్ దేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోందని, ఏఐతో పోటీ పడగల నైపుణ్యాలను యువత అభివృద్ధి చేసుకోవాలని మంత్రి సూచించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శిక్షణ తీసుకుంటేనే ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోగలమన్నారు.
ఈ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ద్వారా యూరోప్ దేశాల్లో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అవకాశాలపై తెలంగాణ యువతకు స్పష్టమైన అవగాహన కలుగుతోందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ స్కిల్ మొబిలిటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
జర్మనీ సహా పలు యూరోపియన్ దేశాల్లో పెరుగుతున్న నైపుణ్యాల డిమాండ్కు అనుగుణంగా రాష్ట్ర యువతను సిద్ధం చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. భారత్–ఈయూ మధ్య వలసలు, ఉపాధి అవకాశాలపై జరిగిన చర్చలు యువత భవిష్యత్తుకు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
