- రూ. 1.03 కోట్ల విలువైన బంగారు కిరీటం..
- సమర్పించిన ఏలూరుకు చెందిన శ్రేణివాసరావు..
గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా షిర్డీ సాయిబాబాకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఏపీలోని ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు అనే భక్తుడు సాయినాథుడిపై తన భక్తిని చాటుకుంటూ రూ.1.03 కోట్ల విలువైన బంగారు కిరీటాన్ని గురుదక్షిణగా అందించారు. గురు పౌర్ణమి వేళ షిర్డీలో మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో ఈ కానుకను ఆలయ సంస్థాన్కు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సాయిబాబాను తన గురువుగా భావించి ఈ కానుక సమర్పించినట్లు తెలిపారు. 629 గ్రాముల బరువున్న ఈ స్వర్ణ కిరీటాన్ని నవరత్నాలు, నవగ్రహాలు, అమెరికన్ సీజెడ్ డైమండ్స్తో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. బాబాకు హారతి ఇచ్చే సమయాల్లో ఈ కిరీటాన్ని అలంకరించాలని ఆయన సంస్థాన్ ప్రతినిధులను కోరారు.
శ్రీనివాసరావుతో పాటు ఇతర భక్తులు కూడా తమ భక్తిని చాటుకున్నారు. జబల్పూర్కు చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఓంప్రకాష్ శర్మ రూ.8 లక్షల విలువైన 60 గ్రాముల బంగారు కిరీటాన్ని సమర్పించారు. బరోడాకు చెందిన విజయ్ నాయక్ అనే భక్తుడు రూ.9 లక్షల విలువైన 51 గ్రాముల బంగారు ‘ఓం’ అక్షరాలను రెండు అందించారు. గురు పౌర్ణమి ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి సాయినాథుడిని దర్శించుకున్నారు. ప్రతీ ఏటా ఈ పర్వదినాన భక్తులు తమకు తోచిన విధంగా బాబాకు గురుదక్షిణ సమర్పించడం ఆనవాయితీ.
