- మేనేజర్ చెంపపై కొట్టిన మహిళ..
- కరుణానిథి మనవరాలు చేసిన ఘనకార్యం..
- వైరల్ అవుతున్న వీడియో..
తమిళనాడు రాజధాని చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఐ బ్రాంచ్లో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మనవరాలు, మాజీ కేంద్ర మంత్రి ఎం.కె. అళగిరి కుమార్తె కయల్విళి, బ్రాంచ్ మేనేజర్తో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన జూలై 20న చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఉన్న ఎస్బీఐ ఎన్ఆర్ఐ బ్రాంచ్లో జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్లో కయల్విళి బ్రాంచ్ మేనేజర్ కార్యాలయంలో ఆయనతో వాగ్వాదం చేస్తూ కనిపించారు.
వాగ్వాదం తీవ్రరూపం దాల్చిన సమయంలో మేనేజర్ భంగిమను అనుకరిస్తూ ఎగతాళి చేసిన అనంతరం ఆయన చెంపపై కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తి కయల్విళిని శాంతింపజేయడానికి ప్రయత్నించిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, కయల్విళికి చెందినదిగా చెబుతున్న భవనంలో ఉన్న లిఫ్ట్ పనిచేయకపోవడంపై తలెత్తిన వివాదమే ఈ ఘర్షణకు కారణమైనట్లు పోలీసులు వెల్లడించారు. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కయల్విళిపై దాడి, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసుల అధికారులు తెలిపారు.
బ్రాంచ్లోని సీసీటీవీ కెమెరాల్లో మొత్తం ఘటన రికార్డుకాగా, ఆ వీడియో శనివారం (జూలై 25) సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు విచారణ అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు
