రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులు అయిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబంధించిన యథార్థ ఘటనల ఆధారంగా చేసుకుని ‘రక్త చరిత్ర’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని క్రియేటివ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెలిపారు. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం 2010లో విడుదలై, అప్పట్లో సూపర్ హిట్ అయింది.

తన స్పృజనాత్మకతకు, ఆ టైమ్ లో వచ్చిన కొత్త టెక్నాలజీని మేళవించి సినిమాలను తీయడంలో పేరుగాంచిన వర్మ ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ప్రతిబింబంగా రూపొందించారు. రాయలసీమలోని అనంతపూర్ లో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఫ్యాక్షనిజంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అన్న అంశాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. 16 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ…”ఈ సినిమాను రీ రిలీజ్ చేయమని ప్రేక్షకులు వివిధ ఫ్లాట్ ఫార్మ్స్ లో కోరుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో చూడని నేటి తరం ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం చేరువ కావాలన్న సంకల్పంతో జూలై 17న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదివారం ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశాం. త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తాం. ఆగష్టు నెలలో దీని కొనసాగింపు చిత్రమైన ‘రక్త చరిత్ర’ పార్ట్ -2ను సైతం రీ రిలీజ్ చేయాలని నిర్ణయించాం” అని చెప్పారు.
