మెడికల్ షాప్స్ టెండర్ల పేరుతో చేసిన భారీ స్కాం..
మూడు సార్లు టెండర్ల రద్దులో జరిగిన మతలబేంటి..?
- ఒకే సంస్థకు అనుకూలంగా టెండర్లో షాపులు..
- లోపాయికారి ఒప్పందం ఏమైనా జరిగిందా..?
- నిమ్స్ అధికారులు టెండర్లు రద్దు చేస్తూ మరల టెండర్..
- దీనివల్ల వల్ల నిమ్స్ దవాఖానకు ఏమైనా లాభం చేకూరిందా..?
- నిమ్స్లో ఉన్న మెడికల్ షాప్స్ యాజమాన్య లబ్ది కోసమే చేశారా..?
- ఇదే తరహాలో గతంలో నిమ్స్ లో జరిగిన అక్రమాలను గుర్తించిన ఏసీబీ..?
- పలువురు నిమ్స్ అధికారుల పై డాక్టర్ల పై నమోదైన కేసు..
- మెడికల్ షాప్స్ టెండర్ల వ్యవహారంలో సైతం ఏసీబీ, విజిలెన్స్ విచారణ చేపట్టాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్..
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న నిమ్స్ హాస్పిటల్లో వేసిన మెడికల్ షాప్స్ టెండర్లలో భారీ మిస్టరీ నెలకొని ఉంది..! నాలుగు సార్లు నిబంధనల మార్పు.. మూడు సార్లు టెండర్ల రద్దు.. చివరకు బాలాజీ మెడికల్ షాప్స్ యాజమాన్యానికి లబ్ది చేకూరింది..?
ఒకే సంస్థ కోసం టెండర్ల నిబంధనలు మార్చారా..?
ప్రతి టెండర్లో కొత్త అర్హతలు.. వెనుక ఉన్న అసలు కారణమేంటి..? గతంలో జరిగిన అక్రమాల పై నమోదైన ఏసీబీ కేసులు.. ఇప్పుడు ఫార్మసీ టెండర్లపైనా దర్యాప్తు చేయాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్..?

మొదటి టెండర్లో కఠిన నిబంధనలు :
2023 అక్టోబర్ 5న తొలి టెండర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో రూ.10 కోట్ల సగటు వార్షిక టర్నోవర్, ఎన్.ఎం.సి. గుర్తింపు పొందిన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఫార్మసీ నిర్వహణ అనుభవం వంటి కఠిన అర్హతలు విధించారు. ఈ అర్హతలు జీపీ మెడికల్ స్టోర్-ఏజీ ఫార్మసీ భాగస్వామ్య సంస్థకు చెందిన ఎస్. మోహిత్కు ఉండగా, టెండర్ను రద్దు చేయడం పలు అనుమానాలకు దారితీసింది.
ప్రతి టెండర్లో ఒక్కో కొత్త మార్పు :
రెండో టెండర్లో టర్నోవర్ను రూ.8 కోట్లకు తగ్గించారు. 1000 పడకల ఆస్పత్రి అనుభవాన్ని 500 పడకల ఆస్పత్రికి సడలిం చారు. అయినప్పటికీ ఆరు బిడ్లు వచ్చినా టెండర్ రద్దయింది. మూడో టెండర్లో మరోసారి అర్హతలు మార్చారు. ఏడు బిడ్లు వచ్చినప్పటికీ అందరూ సాంకేతికంగా అనర్హులని ప్రకటిస్తూ ప్రక్రియను నిలిపివేశారు. నాలుగో టెండర్లో అయితే టర్నోవర్ ను రూ.7 కోట్లకు తగ్గించడం, డిమాండ్ డ్రాఫ్ట్ స్థానంలో బ్యాంకు గ్యారంటీకి అవకాశం ఇవ్వడం, మూడు కిలోమీటర్ల పరిధిలో ఫార్మసీ నిర్వహించిన అనుభవం సరిపోతుందని కొత్త నిబంధన చేర్చడం వివాదానికి దారితీసింది.
అనుకూలంగా నిబంధనలు మార్చారనే ఆరోపణలు :
ఈ మార్పులన్నీ షాలిని మెడికల్స్కు అనుకూలంగా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సంస్థ టర్నోవర్కు అనుగుణం గానే అర్హతలను క్రమంగా తగ్గించారంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు ముందుకు చేరిన వివాదం :
ఎస్. మోహిత్తో పాటు మరో రెండు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో డబ్ల్యు.పీ.నెం: 23734 శీf 2024 దాఖలైన పిటిషన్.. టెండర్లను రద్దు చేసిన కారణాలు సహేతుకం గా లేవని, నిబంధనలు పారదర్శకంగా అమలు కాలేదని పిటిషనర్ల తరుపు వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది.. గతంలో నిమ్స్ ఆసుపత్రిలో చేసిన అక్రమాల పై ఏసీబీ కేసులు నమోదైన ఇప్పుడు మళ్లీ అదే తరహాలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
నిమ్స్లో గతంలో మెడికల్ పరి కరాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై ఏసీబీ కేసులు నమో దు చేసిన విషయం తెలిసిందే.. టెండర్ నిబంధనలు ఉల్లంఘిం చడం, ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం కలిగించడం వంటి ఆరోపణల పై సంబంధిత అధికారుల పై విచారణ జరిపి ఈ అక్రమాల్లో భాగస్వాములైన అధికారుల పైన డాక్టర్ల పైన కేసులు నమోదయ్యాయి.. అదే తరహాలో ఇప్పుడు ఫార్మసీ టెండర్ల వ్యవహారంపైనా స్వతంత్ర విచారణ జరపాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి..
వరుసగా మూడు సార్లు టెండర్లు ఎందుకు రద్దు చేశారు? ప్రతిటెండర్లో అర్హతలు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈ మార్పుల వల్ల నిమ్స్కు ఏమి లాభం చేకూరింది..?మార్పుల చేర్పుల సమయంలో టెండర్ వేయడంలో పాత్ర పోషించిన నిమ్స్ అధికారుల పై.. అడ్డదారిలో టెండర్ పొందిన మెడికల్ షాప్స్ యాజమాన్యం పై ఈ టెండర్ వ్యవహారం లో జరిగిన అక్రమాల పై ఏసీబీ లేదా విజిలెన్స్ విచారణ జరిపితే కండ్లు బైర్లు కమ్మే నిజాలు బట్టబయలు అవుతాయని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు..తెరవెనుక ఎవ్వరైనా రాజకీయ నాయకుడు చక్రం తిప్పారా..?ఎవ్వరు ఆనాయకుడు మెడికల్ షాప్స్ కేంద్రం గా సాగుతున్న అక్రమాలకు సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది
