మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని పీవీ విగ్రహానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు కేవలం తెలంగాణకే కాకుండా యావత్ భారతదేశానికి మార్గదర్శకులని అన్నారు. దేశం అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ధైర్యవంతమైన నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారని పేర్కొన్నారు. నేడు ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడానికి పీవీ వేసిన సంస్కరణల పునాదులు ఎంతో కీలకమైనవని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వెడ్మ బొజ్జు, నారాయణ రావు పాటిల్, శ్రీహరి రావు, అప్పాల గణేశ్, తదితరులు పాల్గొన్నారు.
