- సంచలన వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్..
- ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న మస్క్ వ్యాఖ్యలు..
ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ భారత్కు సంబంధించి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ చర్చనీయాంశం అయ్యింది. భారత్ లో జననాల రేటు గణనీయంగా తగ్గుతోందని, ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన ప్రతిస్థాపన స్థాయి కంటే కిందకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై మీడియా సంస్థ ‘ఏఎఫ్ పోస్ట్’ షేర్ చేసిన డేటాను ప్రస్తావిస్తూ మస్క్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. భారత్లో జననాల రేటు ప్రతిస్థాపన స్థాయి కంటే తగ్గిందని, ముఖ్యంగా బాగా చదువుకున్న వారిలో ఈ రేటు చాలా ఏళ్ల క్రితమే పడిపోయిందని తన పోస్టులో పేర్కొన్నారు.
భారతదేశ చరిత్రలో తొలిసారిగా మొత్తం సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు 2.1 పిల్లలు అనే ప్రతిస్థాపన స్థాయి కంటే కిందకు పడిపోయిందని ‘ఏఎఫ్ పోస్ట్’ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలోనే ఈ రేటు 2.3 నుంచి 1.9కి క్షీణించిందని తెలిపింది. ఢిల్లీలో అయితే ఈ రేటు 1.2 కి పడిపోయిందని, ఇది ఫిన్లాండ్ కంటే కూడా తక్కువని నివేదిక పేర్కొన్నది. ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2025’ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1.9 గా నమోదైందని, ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 కంటే తక్కువ అని స్పష్టం చేసింది.
