- జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది నిరసన..
- పోలీసుల అనుమతితోనే కార్యక్రమ నిర్వహణ..
నీట్-యూజీ 2026 పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికింది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో నేడు జంతర్ మంతర్ వద్ద వేలాది మంది యువత భారీ నిరసన చేపట్టారు. అయితే, ఈ నిరసన పూర్తయిన వెంటనే, సంస్థ నిర్వాహకులపై దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు దాఖలైంది.
సీజేపీ వ్యవస్థాపకుడు, బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి అయిన అభిజీత్ దీప్కే నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. ఢిల్లీ పోలీసుల అనుమతితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వేలాది మంది పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు యువ వృత్తి నిపుణులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు, బ్యానర్లతో నినాదాలు చేశారు. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ కూడా ఈ నిరసనకు హాజరై తన మద్దతును ప్రకటించారు.
ఈ నిరసన తర్వాత అభిజీత్ దీప్కేపై కేసు నమోదైంది. అతడు అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ నిరసనను నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. విదేశీ నిధులతోనే ఈ నిరసనను చేపట్టారని, దీని వెనుక దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయని ఫిర్యాదులో ఆరోపించారు.
గత నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కోర్టు విచారణ సందర్భంగా యువతలో కొందరిని ఉద్దేశించి ‘బొద్దింకలు’, ‘పరాన్నజీవులు’ అని సంబోధించారు. ఈ వ్యాఖ్యలకు వ్యంగ్యాస్త్రంగా అభిజీత్ దీప్కే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని సోషల్ మీడియాలో ప్రారంభించారు.
