- రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అడుగు..
- వెహికల్ కమ్యూనికేషన్ వ్యవస్థ దశలవారీగా అమలు..
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. వాహనాల మధ్య నేరుగా సమాచారం పంచుకునే వెహికల్ టు వెహికల్ (వీ2వీ) కమ్యూనికేషన్ వ్యవస్థను దశలవారీగా అమలు చేయాలని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సోమవారం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సాంకేతికత అమల్లోకి వస్తే వేగం, దిశ, స్థానం వంటి వివరాలను వాహనాలు ఒకదానితో మరోటి పంచుకుని ప్రమాదాలపై ముందుగానే హెచ్చరికలు ఇవ్వగలవు.
ప్రతిపాదన ప్రకారం 2027 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే వీ2వీ సదుపాయం ఉన్న వాహనాలు ఏఐఎస్-230 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. 2028 అక్టోబర్ 1 నుంచి ఎల్, ఎం, ఎన్ కేటగిరీల్లోని అన్ని వాహనాలకు ఈ వ్యవస్థ తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. కొత్త నిబంధనల అమలుకు ముందు వాహన తయారీ సంస్థలు, ఇతర భాగస్వాములు అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు తగిన సమయం కల్పించేందుకే దశలవారీ అమలు విధానాన్ని ఎంచుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వీ2వీ సాంకేతికతతో సమీపంలో ఉన్న వాహనాలు వేగం, స్థానం, ప్రయాణ దిశ, వేగం పెరగడం లేదా తగ్గడం వంటి సమాచారాన్ని తక్షణమే పరస్పరం పంచుకుంటాయి.
దీంతో ముందున్న వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేయడం, ఢీకొనే ప్రమాదం, అసురక్షిత లేన్ మార్పు, అత్యవసర సేవల వాహనం సమీపిస్తున్న సందర్భాల్లో డ్రైవర్కు ముందుగానే హెచ్చరిక అందుతుంది. ఈ వ్యవస్థ కంటికి కనిపించని దూరంలో ఉన్న వాహనాల సమాచారాన్ని కూడా అందించగలదని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న భద్రతా వ్యవస్థలు, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) సామర్థ్యాన్ని ఇది మరింత పెంచుతుందని వివరించింది. దీంతో ప్రమాదాలను ముందుగానే అరికట్టడం సులభమవుతుందని అభిప్రాయపడింది.
