వచ్చే ఆర్థిక సంవత్సరం(next financial year)లో దేశీయ సిగరెట్ అమ్మకాలు(Cigarette Sales) 6 నుంచి 8 శాతం తగ్గే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి కొత్త పన్ను అమల్లోకి రానుండటమే దీనికి కారణం. ఫలితంగా అన్ని విభాగాల్లో ధరలు పెరుగుతాయి. ఆ ప్రభావం మిడ్, ప్రీమియం, మాస్ సెగ్మెంట్లపై పడుతుంది. దీంతో తయారీదారులు తమ ధరల వ్యూహాలకు పదునుపెట్టనున్నారు. ప్రస్తుతం సిగరెట్లపై 28% వస్తువులు మరియు సేవల పన్ను(GST)తోపాటు ప్రొడక్ట్ కేటగిరీని బట్టి పరిహార సెస్సు ఉంది. ఫిబ్రవరి నుంచి పరిహార సెస్సు రద్దవుతుంది. సిగరెట్ పొడవును బట్టి ఒక్కో స్టిక్కు రూ.2.05 నుంచి రూ.8.5 వరకు అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తారు. 65 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ పొడవున్న(Mid-to-premium) సిగరెట్లలో ఒక్కో స్టిక్కు రూ.3.6 నుంచి రూ.8.5 వరకు ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తారు. మాస్ విభాగంలోని(65 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణం గల) సిగరెట్లలో ఒక్కో స్టిక్కు రూ.2.05 నుంచి రూ.2.1 వరకు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తారు. అదనంగా.. తుది రిటైల్ ధరపై GST 40 శాతానికి పెరుగుతుంది. సిగరెట్ల అమ్మకాల్లో దాదాపు 40–45 శాతం వాటా మాస్ సెగ్మెంట్దే.
