- శాంతియుత ధర్నాకు అనుమతి నిరాకరణపై హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి
కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీల సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు అధ్యక్షతన కరీంనగర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం పట్ల కరీంనగర్ ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తూ ఆయనకు తప్పించుకునే అవకాశం కల్పిస్తోందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని సమావేశంలో అభిప్రాయపడ్డారు. బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట శాంతియుత ధర్నా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ కమిషనర్కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు.
అయితే ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించనున్న ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడం తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు శాంతియుత ధర్నాకు అనుమతి పొందే దిశగా గౌరవ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు వెల్లడించారు.
ఈ సమావేశానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పట్టణ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ లైబ్రరీ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
