- రెండు వారాల తర్వాత వీడిన మిస్టరీ..
- నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
సికింద్రాబాద్ బొల్లారం(Bolarum) ప్రాంతంలోని 20 మద్రాస్ ఆర్మీ రెజిమెంట్లో ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు వారాల తర్వాత ఈ కేసు మిస్టరీని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఆయుధాల దోపిడీకి పాల్పడిన మాజీ మిలిటరీ అధికారి సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితమే రిటైర్ అయిన ఓ మాజీ మిలిటరీ అధికారి ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఆయనకు మరో ముగ్గురు మిలిటరీ అధికారులు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది.
చెడు వ్యసనాలకు బానిసై ఆయుధాలను దోపిడీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా టాస్క్ఫోర్స్ పోలీసులు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. తెల్లవారుజామున హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి చోరీకి గురైన ఆయుధాలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
