బంగారు ఆభరణాల వ్యాపారులు,గోల్డ్ లోన్ సంస్థల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.అనుమానాస్పద కదలికలతో ఉన్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఇల్లందు క్లబ్లో బెల్లంపల్లి సబ్డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్యాంకులు,ప్రైవేట్ గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు, గోల్డ్ షాపులు,లాడ్జిల మేనేజర్లు, యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
ఏసీపీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ,నేరాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులకు లాడ్జిల్లో గదులు కేటాయించే సమయంలో,వారి ఆధార్ కార్డుతో అనుసంధానమైన ఫోన్ నంబర్లను పరిశీలించిన అనంతరమే గదులు ఇవ్వాలని సూచించారు.ముఖ్యంగా ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయని, దొంగలు బంగారాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు.బ్యాంకులు, ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలు,ఆభరణాల వ్యాపారులు తమ భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని అన్నారు. ఫైర్ సైరన్లను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గన్ లైసెన్స్ కలిగిన వ్యక్తులను భద్రతా సిబ్బందిగా నియమిస్తే పూర్తి స్థాయి భద్రత కల్పించవచ్చని తెలిపారు.ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నేర సంఘటనలు జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రాంతాన్ని నేరరహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్,బెల్లంపల్లి వన్టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, మందమర్రి సీఐ పర్స రమేష్,బెల్లంపల్లి ఎస్ఐలు,బ్యాంకు మేనేజర్లు,గోల్డ్ షాప్ యజమానులు,లాడ్జ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
