- ప్రమాదాలకు కేరాఫ్ గా కామారెడ్డి – ఎల్లారెడ్డి రోడ్డు.
- వర్షపు నీటితో కనిపించని రోడ్డు.. రాత్రి వేళల్లో నరకప్రాయం.
- పైపై ప్యాచ్వర్క్లతో చేతులు దులుపుకుంటున్న అధికారులు.
- నిత్యం ప్రమాదాల బారిన పడుతున్న బైక్, ఆటో ప్రయాణికులు.
- యుద్ధప్రాతిపదికన నాణ్యమైన మరమ్మతులు చేపట్టాలని వాహనదారుల డిమాండ్.
కామారెడ్డి – ఎల్లారెడ్డి ప్రధాన రహదారి(Kamareddy – Yellareddy Road) అధ్వానంగా మారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. రోడ్డు లో ఎక్కడ చుసిన గుంతలు దర్శనమిస్తూ ప్రయాణాన్ని నరకప్రాయంగా మార్చేశాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ కీలక మార్గంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది.
ప్రస్తుత వర్షాకాలంలో గుంతలన్నీ నీటితో నిండి రోడ్డు ఎక్కడుందో, గుంత ఎక్కడుందో తెలియక వాహనదారులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయంగా మారింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో ప్రయాణికులు రాత్రి వేళల్లో ఈ గుంతలను గుర్తించలేక ప్రమాదాల బారినపడి గాయాలపాలవుతున్నారు.


ఇంతటి రద్దీ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు, పాలకులు ఏమాత్రం, పట్టించుకోకపోవడంపై స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారులు చేసిన ప్యాచ్ వర్క్ పనులు నాసిరకంగా ఉండటంతో, ఇటీవల కురిసిన మొదటి వర్షాలకే కంకర కొట్టుకుపోయి రోడ్లు మళ్లీ మొదటికొచ్చాయి.
గుత్తేదారులతో కుమ్మక్కై పైపై పూతలతో నిధులు దండుకోవడమే తప్ప, శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడి, నాణ్యతా ప్రమాణాలతో యుద్ధప్రాతిపదికన ప్యాచ్వర్క్లు పూర్తి చేసి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, వాహనదారులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
