- పోటీ పరీక్షలకు పోటీపడలేని పరిస్థితి..
- ఆందోళనలో నిరుద్యోగులు..
ప్రభుత్వ ఉద్యోగమనేది ఏండ్ల కల.. అనేక నిద్రలేని రాత్రులకు ప్రతిఫలం. సర్కార్ కొలువు లక్ష్యంగా ఎందరో నిరుద్యోగులు కుస్తీపడుతుంటారు. కొందరు అభ్యర్థుల ఆశలపై కటాఫ్ తేదీ నిబంధన నీళ్లు చల్లుతున్నది. ముఖ్యంగా డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్లోని విద్యార్థుల కలను కటాఫ్ తేదీ నిబంధనలు గండికొడుతున్నాయి. స్థూలంగా.. పోటీ పరీక్షలకు పోటీపడలేని పరిస్థితి కల్పిస్తున్నాయి. టీజీపీఎస్సీ ఇటీవలీ కాలంలో ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లు జారీచేసింది. దరఖాస్తుల లింక్ ఓపెన్కాకముందే కటాఫ్ తేదీ నిర్ణయించింది.
ఈ ఒక్క చిన్న సాంకేతిక కారణం వేలాది మంది పాలిట గొడ్డలిపెట్టుగా మారుతున్నదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు.. పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచిచూస్తున్నవారు అవకాశం కోల్పోయే ప్రమాదమున్నదని వాపోతున్నారు. కటాఫ్ తేదీ విషయంలో టీజీపీఎస్సీ పునరాలోచించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం, టీజీపీఎస్సీ స్పందించి సవరించి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.కటాఫ్ తేదీతో రెండు రకాల నష్టం జరుగుతున్నది. కటాఫ్ తేదీకి ముందు సర్టిఫికెట్లు చేతిలో లేకపోతే ఉద్యోగాలకు పోటీపడలేని పరిస్థితి ఉన్నది.
ఇక దరఖాస్తుల సమర్పణకు నెల, నెలన్నర సమయమిస్తున్నారు. ఈ వ్యవధిలో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యి, మెమోలు చేతికందినా పోటీపడలేని పరిస్థితులున్నాయి. ఇలాంటివారు చాలా తక్కువ వ్యవధితో ఈ పోస్టులకు పోటీపడే అవకాశాన్ని కోల్పోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండున్నరేండ్ల కాలంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఐదారే. మళ్లీ నోటిఫికేషన్లు పడతాయా..? అంటే అనుమానమే. ఇప్పుడు త్రుటిలో అవకాశం కోల్పోయిన వారు మళ్లీ ఐదారేండ్ల వరకు నిరీక్షించాల్సిందే.
