- డ్రగ్స్ మరియు నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం
- డీసీపీ మంచిర్యాల ఎ. భాస్కర్
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యక్రమం)లో భాగంగా ఈ రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్నగర్లో ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్,బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ హాజరై ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ, గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం,భవిష్యత్తు, విద్య,ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.
మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులు కుటుంబానికి, సమాజానికి భారంగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలని సూచించారు.ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఆన్లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు,సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాలు,ఫేక్ లింకులు,డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు,పాస్వర్డ్లు ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.


సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, మహిళలు,బాలికలు ఎలాంటి వేధింపులు, గృహ హింస,సైబర్ వేధింపులు లేదా ఇతర సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ చేపడుతున్న ప్రత్యేక చర్యలు, అందుబాటులో ఉన్న సేవల గురించి వివరించారు.మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా,వినియోగం, సైబర్ మోసాలు లేదా మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు.డ్రగ్స్ రహిత,నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో బెల్లంపల్లి-2 టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు మున్సిపల్ కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు, యువత,మహిళలు, కమ్యూనిటీ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
