Monday, May 4, 2026
Homeసాహిత్యంTyagaraja | సంగీత సామ్రాజ్య రారాజు త్యాగరాజు

Tyagaraja | సంగీత సామ్రాజ్య రారాజు త్యాగరాజు

  • మే 4 : నాదబ్రహ్మ త్యాగయ్య జయంతి

అసంఖ్యాక కీర్తనలకు ప్రాణం పోసి, కర్ణాటక సంగీతంలోని నియమాలను సోదాహరణంగా నిరూపించి, కర్ణాటక సంగీతానికి మూల స్తంభమై, త్రైమూర్త్య వాగ్గేయకారులలో ఒకరై, నాదోపాసన ద్వారా, భగవంతుని తెలుసుకో వచ్చునని నిరూపించి, ఆరాధనీయులు అయినారు… త్యాగయ్య, త్యాగబ్రహ్మగా వినుతికెక్కిన వాగ్గేయ కారుడు కాకర్ల త్యాగరాజు, త్యాగయ్య కీర్తనలు, శ్రీరామునిపై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉ పనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియ పరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.

నేటి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలం కాకర్ల గ్రామంలో, 1767 లో మే 4న, తెలుగు వైదిక కుటుంబీకులైన కాకర్ల రామబ్రహ్మం, సీతమ్మ పుణ్య దంపతులకు త్యాగరాజు మూడవ సంతానంగా జన్మించారు. ఆయన జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. ములకనాడు తెలుగు బ్రాహ్మణులు, త్రిలింగ వైదీకులు, అయన పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి తంజావూరు ప్రభువు శరభోజి వద్ద ఉండే వారు. తాత గిరిరాజ కవి. త్యాగ బ్రహ్మం విద్యకోసం, తిరువారూర్ నుండి తిరువయ్యూరు వెళ్లారు.

- Advertisement -

అక్కడ సంస్కృతం, వేద వేదాంగములు ఆమూలాగ్రంగా పఠించి, శొంఠి వెంకట రమణయ్య వద్ద, భక్తిశ్రద్ధలతో సంగీతంలో ప్రావీణ్యం సంపాదించు కున్నారు. తండ్రి పిన్న వయసు నందే స్వర్గ ప్రాప్తి నొందగా, అన్నదమ్ముల మధ్య భాగ పరిష్కారంలో, తమ వంతు వచ్చిన, శ్రీరామ లక్ష్మణ కుల విగ్రహాలను పూజిస్తూ, “ఉ ఛ” వృత్తి స్వీకరించి, ఇష్ట దైవమైన శ్రీ రాముని పై కృతుల రచనలో అధికభాగం గడిపారు. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామ జపం ఆచరించి భగవద్దర్శనం, ఆశీర్వచనం పొందారని చెబుతారు. 18 ఏళ్ల వయసులో, పార్వతి అనే యువతిని వివాహ మాడారు. పార్వతి చిరు ప్రాయ మరణంతో, ఆమె సోదరి కమలను పరిణయ మాడారు.

సీతా లక్ష్మి అనే కూతురు కలిగింది, ఆమె ద్వారా మనమడు కూడా కలిగాడు. కానీ, మనమడు చిన్నతనం లోనే మృతి చెందడంతో, ఆయనకు వారసులు లేకుండా పోయారు. శొంఠి వెంకట రమణయ్య శిష్యరికంలో 13వ ఏటనే “నమో నమో రాఘవా” అనే కీర్తనను “దేశిక తోడి రాగం”లో స్వరపరిచారు. త్యాగరాజు మంచి వైణికులు కూడా. గురువుగారి గృహములో చేసిన కచేరీలో, త్యాగరాజ పంచరత్న కృతులలో ఐదవది అయిన, “ఎందరో మహానుభావులు” కీర్తన స్వరపరచి గానం చేశారు.

త్యాగయ్య గొప్పతనాన్ని గుర్తించిన గురువు, తంజావూరు రాజుకు చెప్పగా, ఆ రాజు ధన, కనక, వస్తు, వాహనాలతో సభకు ఆహ్వానించాడు. కానీ తనకు “నిధి కన్నా రాముని సన్నిధి సేవే సుఖమ”ని భావించి, త్యాగయ్య అన్నింటిని తిరస్కరించారు. సంగీతంలో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం కన్నా, భగవదారాధనకు ఒక సాధనంగానే చూశారాయన. తంజావూరు రాజు కానుకల తిరస్కార ఫలితంగా, సోదరుడు జపేశుడు, త్యాగయ్యచే నిత్య పూజలందుకునే, శ్రీరామ పట్టాభిషేకం విగ్రహాలను, కావేరీ నదిలో విసిరి వేయగా, శ్రీరామ వియోగాన్ని భరించలేక… దక్షిణ దేశ యాత్రలు చేసి, ఎన్నో ఆలయాలు, తీర్థ క్షేత్రాలను దర్శించారు. ఈ క్రమంలో అత్యద్భుత కీర్తనలను రచించారు.

“రామేతి మధురం వాచం” అన్నట్లు 96 కోట్ల సార్లు రామ నామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామికి, దేవ ఋషి అయిన “నారదుడే స్వయంగా సంగీతంలోని రహస్యాలను చెప్పి, “స్వరార్ణవము” ఇచ్చినట్లు, సందర్భంలోనే “సాధించెనే మనసా” అనే పంచ రత్న మాలిక లోని మూడవ కృతి చేసినట్లు ప్రాచుర్యంలో ఉన్నది. నారద అనుగ్రహ ఫలితంగానే అనేక విషయాలు గ్రహించి, 24వేల రచనలు, 800కీర్తనలు గావించాడు. మంత్రోపదేశంతో “స్వర్ణార్ణవం, నారదీయం” అనే రెండు సంగీత రహ స్మార్థ శాస్త్ర గ్రంథ రచనలు గావించారు.

త్యాగయ్య కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్టానం, అని నాలుగు విధాలుగా గుర్తించారు. చాలావరకు తెలుగులో రచనలు చేసినా, అవి తెలుగు నాట కన్నా, తమిళ నాట ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. జగదానంద కారకా అనే కీర్తన శ్రీరాముని 109 నామాలను ఉటంకిస్తుంది. “జగదానంద కారకా (నాట), దుడుకు గల (గౌళ), సాధించినే (అరభి), ఎందరో మహాను భావులు (శ్రీ), కన కన రుచిరా (వరాళీ.. అనేవి పంచ రత్న మాలికగా, “త్యాగరాజ ఆరాధనోత్సవాలలో ప్రారంభం కీర్తనలుగా గానం చేయ బడతాయి. త్యాగరాజ స్వామి పరమపదించిన దినమైన, పుష్య కృష్ణ పక్ష పంచమి నాడు, శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రధానంగా తమిళనాడు లోని తంజావూరు జిల్లా తిరువయ్యూరు లోని, త్యాగయ్య సమాధి ప్రాంగణాన, ఉత్సవాలు ఏటా జరుగుతాయి. త్యాగయ్య 1847 జనవరి 6న తన 79వ ఏట మరణించగా, ఆయన మరణానికి ముందు సన్యాసిగా మారగా, ఆయన భౌతిక కాయాన్ని కావేరీ తీరాన ఖననం చేసి, అక్కడ స్మారక చిహ్నాల నిర్మాణం గావించారు.

ఆయన శిష్యగణం అక్కడే సంస్కరణ కార్యక్రమాలు జరుపగా, 1903 తర్వాత పట్టించుకునే స్థితిలో, ప్రముఖ సంగీత విద్వాంసులైన, ఉ మయాల్పురం కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్లు తమ గురువు సమాధి దయనీయ స్థితికి చలించి, పునరుద్ధరణ గావించారు. 1905లో త్యాగయ్య వర్ధంతి దినాన తిరువయ్యూరులో, అన్నదానం, సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహించారు. నాటినుండి దేశంలో పలుచోట్ల ఆరాధనోత్సవాలు నిర్వహిస్తుం డడం అనవాయితీగా వస్తున్నది. అలాగే త్యాగయ్య జన్మదినం రోజుని భారతీయ సంగీత దినోత్సవంగా జరుపు కుంటారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News