- కార్మిక హక్కుల కోసం పోరాటానికి పిలుపునిచ్చిన వక్తలు..
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా జవహర్ నగర్ జిహెచ్ఎంసి పరిధిలో వివిధ ప్రాంతాల్లో మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సిపిఐ కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి ఆధ్వర్యంలో జరిగాయి. రావి నారాయణరెడ్డి నగర్, కోళ్ల ఫారం బస్ స్టాప్, ఫైరింగ్ కట్ట శాంతినగర్, సాయిబాబా కమాన్ ఆటో స్టాండ్, శివాజీ నగర్ మునిసిపల్ ఆఫీస్ సమీపంలోని సిపిఐ కార్యాలయ స్థలం, డెంటల్ కాలేజీ ముందు గిరిప్రసాద్ నగర్ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. అనంతరం గిరిప్రసాద్ నగర్లో బహిరంగ సభ జరిగింది.
ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యుడు వి ఎస్ బోస్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మే 1న జరుపుకునే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కార్మికుల హక్కుల కోసం జరిగిన గొప్ప పోరాటాల ఫలితమని తెలిపారు. దేశంలోని కార్మికులు, కూలీలు, ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు నిరుద్యోగ యువత కలిసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. చరిత్రను ప్రస్తావిస్తూ 19వ శతాబ్దంలో అమెరికాలో కార్మికులు రోజుకు 12 నుంచి 16 గంటలు పని చేయాల్సి వచ్చిందని, ఎనిమిది గంటల పని విధానం కోసం భారీ ఉద్యమాలు ప్రారంభమయ్యాయని చెప్పారు.

1886 మే 1న చికాగో నగరంలో జరిగిన సమ్మెలో హే మార్కెట్ ఘటనలో పోలీసుల కాల్పుల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఈ సంఘటన ప్రపంచ కార్మిక ఉద్యమానికి మలుపు తీసుకువచ్చిందని తెలిపారు. 1889లో అంతర్జాతీయ కార్మిక సంఘాల సమావేశంలో మే 1ను ప్రతి సంవత్సరం కార్మిక దినోత్సవంగా పాటించాలని నిర్ణయించారని పేర్కొన్నారు. కనీస వేతనం, కార్మిక హక్కులు అన్నీ కార్మికుల దీర్ఘకాలిక పోరాటాల ఫలితమేనని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటపల్లి శంకర్, నిమ్మల నరసింహ, కాప్రా మండల సహాయ కార్యదర్శి రాజేశ్వరి, గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి వి స్వరూప నాయక్, ఏఐటిసీ మండల అధ్యక్షుడు అంబాల ఎల్లయ్య, కీసర మండల సహాయ కార్యదర్శి వి రవి నాయక్, గిరిప్రసాద్ నగర్ శాఖ కార్యదర్శి కొండా సత్యం సాగర్, మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు కోదాసు జయమ్మ, కే కవిత, సిపిఐ కాలనీ కార్యదర్శి కే రాజు, కే కురుమయ్య, ఎల్లయ్య, నరసింహ, బద్రి, లక్ష్మి, శ్యామ్ దాస్, డి మల్లిక తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా బి జె ఆర్ నగర్లో మేడే సందర్భంగా నూతన ఆటో స్టాండ్ ఆవిర్భావం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి ఎస్ బోస్ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆటో స్టాండ్ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఇల్లందులో ప్రభాకర్, అధ్యక్షుడిగా గొల్లూరి ఎల్లయ్య, ఉపాధ్యక్షుడిగా వి రామాచారి, ప్రధాన కార్యదర్శులుగా కే బాబు, ఏ శ్రీను, కార్యదర్శిగా డి యాదయ్య, కోశాధికారిగా టేకుల ప్రశాంత్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు.
