- కోమల్ల టోల్ గేట్ వద్ద ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం.
వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ఉపశమనం కల్పించేలా హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై రఘునాథ్ పల్లి మండలంలోని కోమల్ల టోల్ గేట్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జనగామ జిల్లా మాజీ జడ్పీటీసీ సభ్యుల ఫోరమ్ అధ్యక్షుడు బొల్లం అజయ్ మణికంఠ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. స్వర్గీయ మాజీ ఎంపీపీ బొల్లం బిక్షపతి స్మారకార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
బిక్షపతి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన స్ఫూర్తితో కుటుంబ సభ్యులు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రహదారులపై ప్రయాణించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సమయంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించడం గొప్ప సేవ అని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
బొల్లం అజయ్ మణికంఠ మాట్లాడుతూ, తమ తండ్రి బిక్షపతి జ్ఞాపకార్థం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ ముసుపట్ల విజయ్, యూత్ అధ్యక్షుడు దుబ్బాక హరీష్ గౌడ్, వెల్దీ ఉపసర్పంచ్ ఎడ్ల బాలరాజ్, బాల్నే పరుశురాం, పేర్ని ప్రసాద్, పేర్ని లెనిన్, కరీంకొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
