- విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారి హామీ.
బండరావిరాల గ్రామ పంచాయతీ సెక్రటరీ పి.నవనీత రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో పనిచేస్తున్న సదరు అధికారిణిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (DPO) వి. సురేష్ మోహన్ ని కలిసి ఫిర్యాదు చేశారు.
గ్రామసభ తీర్మానం లేకుండా, ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండానే శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖలో కలపాలని సెక్రటరీ ఏకపక్షంగా లేఖ ఇవ్వడంపై సర్పంచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ నుండి వచ్చిన అభ్యంతరాల నోటీసులపై సంతకం చేసి, గత నెల రోజులుగా ఆ విషయాన్ని నూతన పాలకవర్గానికి తెలియకుండా దాచిపెట్టి సెక్రటరీ మోసపూరితంగా వ్యవహరించారని DPO దృష్టికి తీసుకెళ్లారు.
ఒక దళిత సర్పంచ్కు సహకరించకుండా, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న సదరు అధికారిణిని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సర్పంచ్ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన DPO సురేష్ మోహన్, ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశిస్తానని, విచారణలో తప్పు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దూస శంకర్ ముదిరాజ్, వార్డు సభ్యులు గుండ్ల భవాని-శివ ముదిరాజ్, కన్నె భరత్ యాదవ్, యెడవెల్లి సుష్మిత రాము గుప్తా, ఏర్పుల హరికృష్ణ పాల్గొన్నారు.
