హైదరాబాద్.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence)కి కేరాఫ్ అడ్రస్(Care-of Address)గా మారుతోందని ఐటీ & పరిశ్రమల శాఖల మంత్రి(IT & Industries Minister) దుద్దిల్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) అన్నారు. ఈ నగరం మన దేశంలోని ప్రముఖ AI హబ్ల్లో ఒకటిగా వేగంగా ఎదుగుతోందని అన్నారు. ఐడెన్ సంస్థ హైదరాబాద్లో విస్తరణలో భాగంగా హైటెక్ సిటీలో ఏర్పాటుచేసిన AI ఇంజనీరింగ్ సెంటర్ను(Aiden AI Engineering Centre) ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని బలమైన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ ప్రపంచ సంస్థలను ఆకర్షిస్తోందని చెప్పారు. USAలోని ప్రిన్స్టన్లో ప్రధాన కార్యాలయం కలిగిన ఐడెన్ సంస్థ తాజాగా 500 మంది నిపుణులను నియమించుకుంటోందని తెలిపారు. రానున్న రెండేళ్లలో మరో 500 మందికి ఉద్యోగాలు ఇవ్వనుందని పేర్కొన్నారు. AI ఆధారిత ఆవిష్కరణలకు, పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.
