- మా నంబర్కు ఫిర్యాదు చేయండి..
- సీపీ సజ్జనార్ కీలక సూచన.
చైనా మాంజా విక్రయాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ (ట్విటర్) వేదికగా హెచ్చరించారు.చైనా మాంజా ప్రాణాంతకంగా మారుతోందని, దీనివల్ల పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, పక్షులు, జంతువులు తీవ్రంగా గాయపడడమే కాకుండా ప్రాణ నష్టాలు కూడా సంభవిస్తున్నాయని సజ్జనార్ తెలిపారు. చైనా మాంజా అక్రమ తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు హైదరాబాద్ పోలీస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. చైనా మాంజాను తయారు చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని, ఈ విషయంలో ఏమాత్రం సడలింపు ఉండదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
చైనా మాంజా వినియోగిస్తున్న వారిని ఎవరైనా గమనిస్తే వెంటనే వారిని ఆపి, దాని ప్రమాదాలపై అవగాహన కల్పించాలని ప్రజలకు కమిషనర్ సూచించారు. అలాగే చైనీస్ మాంజా విక్రయాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. 9490616555 గల నంబర్కి ఫిర్యాదు చేయాలని సూచించారు. సమయానికి తీసుకునే చర్యలు ఓ ప్రాణాన్ని కాపాడగలవని ఆయన పేర్కొన్నారు. పతంగి పండుగను సురక్షితంగా, మానవీయంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
