కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ (Pemmasani Chandrashekar) అన్నారు. లింగ సమానత్వ (Gender Equality) జాతీయ ప్రచార కార్యక్రమాన్ని (నయీ చేతన 4.0 కార్యక్రమాన్ని) (Nayi Chetna) కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ సౌజన్యంతో తుళ్లూరులో శనివారం నిర్వహించారు. సీఆర్డీఏ (CRDA) స్కిల్ హబ్ భవనంలో జెండర్ రిసోర్స్ సెంటర్(GRC)ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం.. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన సభను, ప్రదర్శనశాలలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వివక్ష తగ్గించడం నయీ చేతన 4.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. సమాజంలో బాల్య వివాహాలు(Child Marriages), గృహ హింస(Domestic Violence), లింగ వివక్ష వంటి రుగ్మతలు ఉన్నాయని తెలిపారు. దేశంలో 4.50 లక్షల గృహ హింస కేసులు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ వివక్షకు గురవుతున్నట్లు అంచనా ఉన్నప్పటికీ అన్ని కేసులు నమోదు కావడం లేదని చెప్పారు. ఇందుకు పరువు ప్రతిష్ట కోసం ఆలోచించడం కారణమని అభిప్రాయపడ్డారు. అందుకే నయీ చేతన కార్యక్రమాన్ని 2021లో శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
