కరీంనగర్: కరీంనగర్ జిల్లా లో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు జిల్లా అంతట ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
మొదటి దశ పోలింగ్ తో పాటు రెండవ దశ పోలింగ్ పూర్తయిన తరువాత కూడా సంబంధిత గ్రామాలు, మండలాల్లో ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందని, మూడవ దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి తొలగిపోతుందని తెలిపారు.
అందువల్ల మొదటి, రెండవ దశలో ఎన్నికైన అభ్యర్థులు, ఇతరులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించరాదని తెలిపారు. ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలలో సైతం ఎన్నికల కోడ్ అమలులోనే ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారంనిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికలకు దూరమయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు
