తెల్లాపూర్ మున్సిపాలిటీలో అక్రమ ఓసీల కుంభకోణం!
- నిర్లక్ష్యంపై సీడీఎంఏ దృష్టి సారించాలి
- అక్రమాలపై కమిషనర్ల మౌనం, చర్యలు శూన్యం..!
సంగారెడ్డి జిల్లా, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిబంధ నలకు విరుద్ధంగా నిర్మించిన భారీ వాణిజ్య భవనాలు మరియు వాటికి రాజకీయ ఒత్తిళ్లతో అక్రమంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) జారీ అయిన వ్యవహారం తెలంగాణ పురపాలక వ్యవస్థ పారదర్శకతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.
‘ఆదాబ్ హైదరాబాద్’ గతంలో ఈ చీకటి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చినా, రెండు వారాలకు పైగా గడుస్తున్నా.. ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీఓ) కేవలం నోటీసులకే పరిమితమై మౌనం వహించడం, అక్రమార్కులకు ‘అధికార అండదండలు’ ఇస్తున్నట్టేనని పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

అప్పటి అధికారుల ‘ఘోరం’..
తెల్లాపూర్ సర్వే నెం. 407లో నివాస నిర్మాణ అనుమతికి బదులుగా కళ్లు చెదిరే వాణిజ్య భవనాలను నిర్మించారు. ఈ అక్రమాలకు అప్పటి మున్సిపల్ కమిషనర్, టీపీఓలు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి, చట్టానికి విరుద్ధంగా అక్రమ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) జారీ చేయడం ‘చట్టాన్ని, ప్రజా విశ్వాసాన్ని అధికారులు కలిసికట్టుగా గొంతు కోసిన ఘోరం’గా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి అధికారి నివేదికకు విరుద్ధంగా ఈ అక్రమ ఓసీలు జారీ కావడం అప్పటి అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.
ప్రస్తుత అధికారుల ‘మౌన సమ్మతి’..
ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాక ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ మరియు టీపీఓల వైఖరి మరింత దారుణంగా ఉంది. వీరు ‘ఉస్సాలగట్టె నక్క’ లెక్కన, కేవలం నోటీసులు జారీ చేయడంతోనే చేతులు ముడుచుకున్నారు. చట్టవిరుద్ధంగా జారీ అయిన ఓసీలను రద్దు చేయకపోవడం, కనీసం అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి కానీ, సీజ్ చేయడానికి కానీ ‘అడుగు ముందుకు వేయకపోవడం’.. ఇదంతా ‘అధికార అండదండల’ కు పరాకాష్ట అని ప్రజలు విమర్శిస్తున్నారు.
నోటీసులు జారీ చేయడం అంటే, కాలయాపన చేయడమే. అక్రమం అని తేలినప్పుడు, ఆ ఓసీలను వెంటనే రద్దు చేసి, నిర్మాణాన్ని కూల్చివేయాలి. అధికారులు చర్యలు తీసుకోక పోవడం వెనుక ఏదో మతలబు దాగి ఉందన్న అనుమానం కలుగుతోంది. ఈ నెల రోజుల్లో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ‘ప్రేక్షక పాత్ర’ వహించడం ముమ్మాటికీ విధి నిర్వహణలో వైఫల్యానికి సాక్ష్యం. వీరి ఈ ‘మౌన సమ్మతి’ పరోక్షంగా ఈ అక్రమాలకు వంతపలికిట్లే కాకుండా, మున్సిపల్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న కొద్దిపాటి విశ్వాసాన్ని కూడా తగ్గిస్తోంది.

సీడీఎంఏ ‘కొరడా’ ఝళిపించాలె!
తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019ని, పారదర్శక పాలనను కాపాడటానికి, పురపాలక పరిపాలన డైరెక్టర్ (సీడీఎంఏ) ఇకపై కనుమూసి కూర్చోవద్దు. పౌర సమాజం నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్లు
ప్రస్తుత అధికారులపై క్రమశిక్షణా చర్యలు: కథనం ప్రచురితమైన తర్వాత కూడా చట్ట ప్రకారం తక్షణ చర్యలు తీసుకోకుండా నిర్ల క్ష్యం వహించిన ప్రస్తుత కమిషనర్, టీపీఓలపై సీడీఎంఏ తక్షణ మే కొరడా రaళిపించి, కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
అప్పటి అధికారులపై విచారణ: రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అక్రమంగా ఓసీలు జారీ చేసిన అప్పటి అధికారులపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలి.
ఓసీలు, నిర్మాణాల రద్దు: చట్టవిరుద్ధంగా జారీ అయిన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లను వెంటనే రద్దు చేయాలి. అనధికారిక వాణిజ్య నిర్మాణాలను వెంటనే సీజ్ చేసి, కూల్చివేయాలి.
‘కట్టె కాలక ముందే గట్టిగా మాట్లాడాలె’ అన్నట్లుగా, సీడీఎంఏ కమిషనర్ ఈ తెల్లాపూర్ అక్రమాలపై స్వయంగా దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకుంటేనే, భవిష్యత్తులో ఇటువంటి చట్ట ఉల్లంఘనలకు తావుండదని పౌర సమాజం గట్టిగా కోరుతోంది. లేదంటే, ‘‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు’’ ఈ అక్రమాలు రేపటి రోజున వ్యవస్థకే తలవంపులు తెస్తాయి.
