కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది తగదంటూ బాధితుల ఆవేదన
పెండింగ్ బిల్లులను ఇప్పటికైనా చెల్లించాలని మాజీ సర్పంచ్లు (Former Sarpanchs) ప్రభుత్వాన్ని (Government) కోరారు. బిల్లులు రాకపోతే తమకు బలవన్మరణాలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం(State Human Rights Commission)లో 6 నెలల కిందట ఇచ్చిన ఫిర్యాదు(complaint)పై ఇవాళ విచారణ (investigation) జరగ్గా మాజీ సర్పంచ్లు హాజరయ్యారు. కానీ.. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎవరూ రాలేదు.
దీంతో తదుపరి, చివరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 2కు వాయిదా వేశారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ (Panchayati Raj) శాఖ అధికారులకు తెలిపారు. గత నాలుగు వాయిదాలకు కూడా అధికారులు హాజరుకాకపోవటంపై సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆగ్రహం వెలిబుచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవటం దారుణమని కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు.

ఇప్పటికే పలువురు సర్పంచ్లు ఆవేదనతో చనిపోయారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగతావాళ్లు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్కి వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం మాజీ సర్పంచ్లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లకు తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు కేశబోయిన మల్లయ్య, సముద్రాల రమేష్, నడికూడా రవీందర్రావు, వెంకటరామిరెడ్డి, పాండురంగారెడ్డి, బస్మాపురం సప్న, అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
