మైనారిటీలు ఏకమై కాంగ్రెస్ను గెలిపించారు
ఇక, హిందువులను ఏకం చేసి కాంగ్రెస్ను ఓడిస్తాం
ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections)తోపాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (JubileeHills Bye Election) ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ (Congress Party) పని ఖతమైందని, రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇక పబ్జీ గేమ్ ఆడుకోవడానికి పరిమితమవుతాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ (KTR) వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పతనం కొనసాగుతోందని చెప్పారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ సిట్టింగ్ స్థానాలను కోల్పోయాక కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని కేటీఆర్ అనటం సిగ్గుచేటని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మైనారిటీలు ఒక్కటై కాంగ్రెస్ పార్టీని గెలిపించారని తెలిపారు. దీనిపై రాష్ట్రంలోని హిందువులు ఆలోచించాలని కోరారు. ఇకపై హిందువులను ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెబుతామని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, తమిళనాడు సహ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మల్క కొమరయ్య, గౌతంరావు, వీరేందర్ గౌడ్, ఎన్వీ సుభాష్, వేముల అశోక్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
