వన్డే వరల్డ్ కప్లో ఆసియా జట్టు శ్రీలంక ఇంటిదారి పట్టింది. 1992 ప్రపంచ కప్ విజేత దారుణమైన ఆటతో కోట్లాదిమంది లంకేయులను నిరాశపరిచింది. అయితే.. కుశాల్ మెండిస్ సేన ఘోర పరాభవాలకు బయటి వ్యక్తుల కుట్ర కారణమని శుక్రవారం చీఫ్ సెలెక్టర్ ప్రమోదయ విక్రమసింఘే ఆరోపించాడు. రెండు రోజులు సమయం ఇస్తే.. కుట్ర మొత్తాన్ని బయటపెడుతానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు రెండు రోజులు టైమ్ ఇవ్వండి. కుట్రకు సంబంధించిన అన్ని విషయాలను బయటపెడుతా అని విక్రమసింఘే అన్నాడు. జట్టు వైఫల్యానికి తాను బాధ్యత వహిస్తానని’ విక్రమసింఘే తెలిపాడు. వరల్డ్ కప్లో చివరి లీగ్ మ్యాచ్లోనూ ఓడిన శ్రీలంక శుక్రవారం స్వదేశానికి బయలుదేరింది. వాంఖడేలో భారత జట్టుపై 302 పరుగుల భారీ ఓటమితో లంక క్రికెట్ బోర్డు తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సభ్యులందరూ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు మొత్తాన్ని రద్దు చేసి.. అర్జున రణతుంగ నేతృత్వంలో మధ్యంతర కమిటీ ఏర్పాడు చేశాడు. దాంతో, బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వా కోర్టును ఆశ్రయించాడు. కోర్టు బోర్డు సభ్యులకు రెండు వారాల పాటు పదవిలో కొనసాగేందుకు అనుమతిచ్చింది.