- ఇద్దరు లాయర్ల సమక్షంలో సీఐడీ అధికారుల ఆరా..
- రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఎంక్వయిరీ..
- పాల్గొన్న 12 మంది సభ్యుల టీమ్..
- థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదన్న న్యాయస్థానం..
- మొత్తం రెండు సెషన్స్ లో 6 గంటలపాటు విచారణ..
అమరావతి : తొలి రోజు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు విచారణ ముగిసింది. ఇద్దరు లాయర్ల సమక్షంలోనే.. లోకేష్, కిలారి రాజేష్, పీఏ శ్రీనివాస్ పాత్రపై చంద్రబాబును సీఐడీ అధికారులు ఆరా తీశారు. ఉదయం పదిగంటలకు మొదలైన విచారణ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తొలి సెషన్లో 3 గంటలకు పైగా సీఐడీ అధికారులు ప్రశ్నలు వేశారు. ప్రతి గంటకు ఇద్దరు చొప్పున సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి వరకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత రెండో సెషనలో 3 గంటల పాటువిచారణ జరిగింది. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. సుమారు 6 గంటలపాటు విచారణ సాగింది. ఉదయం, మధ్యాహ్నం ఇలా రెండు విడతల్లో సీఐడీ అధికారులు ప్రశ్నించారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల టీమ్ చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబును శనివారం ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించారు. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్తోపాటు మరో ముగ్గురి సమక్షంలో ఈ విచారణ కొనసాగింది. విచారణకు ముందు.. ఆ తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు.
చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారించాలని కోర్టు డైరెక్షన్ చేసింది. శని, ఆదివారాలు.. రెండు రోజుల పాటు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే విచారించాలని.. గంటకోసారి అయిదు నిమిషాల విరామమిచ్చి న్యాయవాదితో మాట్లాడుకునేందుకు అవకాశమివ్వాలని ఏసీబీ న్యాయస్థానం న్యాయాధికారి హిమబిందు తెలిపారు. చంద్రబాబును విచారణ జరుపుతున్న సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.