- వారి సమగ్ర డేటాబేస్ రూపొందించాలి..
- ఉన్నతాధికారులను ఆదేశించిన డీజీపీ సీవీ ఆనంద్..
తెలంగాణలో నేపాల్ సహా ఇతర దేశాల నుంచి వచ్చి గృహ కార్మికులుగా పనిచేస్తున్న వారిపై రాష్ట్ర పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యంగా నేపాలీ పనిమనుషుల వివరాలతో కూడిన సమగ్ర డేటాబేస్ను రూపొందించాలని డీజీపీ సీవీ ఆనంద్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల కాలంలో నేపాల్కు చెందిన కొందరు పనిమనుషులు వరుస నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, భద్రతను పటిష్ఠం చేసేందుకు పోలీస్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో డీజీపీ ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత నెలలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్న ఓ విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసి, నగదు, ఆభరణాలతో పరారైన కేసులో నేపాలీ పనిమనిషి, ఆమె సహచరుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. మరో ఉదంతంలో, నేపాలీ దంపతులు యజమానులకు మత్తుమందు ఇచ్చి విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటికే ‘మీ సురక్ష’ కార్యక్రమం ద్వారా 39,000 మందికి పైగా గృహ కార్మికుల వివరాలను సేకరించగా, వారిలో దాదాపు 1,200 మంది నేపాల్కు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. విదేశీ పనిమనుషుల నివాస, ఉపాధి వివరాలను పక్కాగా నమోదు చేయడం ద్వారా వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించడం సులభమవుతుందని డీజీపీ అభిప్రాయపడ్డారు.
డేటా ఆధారిత పోలీసింగ్ను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఈ డేటాబేస్ను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైనా కొత్త వారిని పనిలో చేర్చుకునే ముందు, యజమానులు తప్పనిసరిగా వారి పూర్వాపరాలను పోలీసుల ద్వారా ధ్రువీకరించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
