- నాసిక్ లోని, టాటా కన్సల్టెన్సీ వ్యవహారంపై తీవ్ర చర్చ..
- కార్పొరేట్ జీహాద్ చర్య అని తేలితే కఠిన చర్యలు..
- హెచ్చరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్..
నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యూనిట్లో జరిగిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తొలిసారిగా స్పందించారు. ఈ ఘటన ‘కార్పొరేట్ జిహాద్’ చర్య అని తేలితే, దాని మూలాలను గుర్తించేందుకు దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపుతామని హెచ్చరించారు.
ఈ ఘటన అత్యంత తీవ్రమైనదని, దీని వెనుక పెద్ద ముఠా ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా వెల్లడైందని అన్నారు. సంస్థలో జరిగిన ఈ ఘటనను గుర్తించినందుకు ఆయన టీసీఎస్ను అభినందించారు. కంపెనీ యాజమాన్యం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిందని, పోలీసులకు దర్యాప్తులో సహకరిస్తోందని తెలిపారు.
ఈ ఘటనకు మూల కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టబోమని హెచ్చరించారు. పోలీసులు ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారని అన్నారు.
ఈ ఘటనకు సంబంధించి నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్ మాట్లాడుతూ, బాధితురాలు తన సమస్యపై పలుమార్లు హెచ్ఆర్ విభాగానికి ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని అన్నారు. పైగా పని ప్రదేశాల్లో ఇలాంటివి సహజమని చెప్పి ఆమెను పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. నిందితులకు అతివాద భావజాల గ్రూపులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.
