- కొన్ని వారాలు కొనసాగే అవకాశం..
- నిలిచిపోయిన దాదాపు 500 నౌకలు..
హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రపంచ ఇంధన మార్కెట్లకు స్వాగతించదగిన పరిణామం. అయితే ఈ కీలకమైన జలమార్గం గుండా సాధారణ చమురు ప్రవాహాలను పునరుద్ధరించడానికి రోజులు కాదు, వారాలు పట్టవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 500 నౌకలు నిలిచివపోవడం, ఇతర భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ఈ ఆలస్యం ప్రధానంగా జరుగుతున్నది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రకారం ఇరాన్ హొర్ముజ్ జలసంధి నుండి మందుపాతరలను(సీమైన్స్) తొలగిస్తుంది. నౌకాయానంపై సుంకాలు విధించదు.
దీనికి ప్రతిగా అమెరికా ఇరాన్ ఓడరేవుల చుట్టూ ఉన్న తన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. ఈ మార్గంలో నెలల తరబడి సాగిన ఘర్షణల వల్ల అంతరాయాలు ఏర్పడటంతో సాధారణ చమురు సరఫరా పునరుద్ధరణకు కొన్ని వారాల సమయం పట్టవచ్చని నిపుణులు తెలిపారు. సుమారు 500 వాణిజ్య నౌకలు గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోవడంతో భారీగా రద్దీ పేరుకుపోయింది.
రాకపోకలు వెంటనే పునరుద్ధరించినప్పటికీ ఈ రద్దీని పూర్తిగా తొలగించడానికి వారాల సమయం పట్టవచ్చు. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు హొర్ముజ్ జలసంధి గుండా రోజూ సుమారు 130 నౌకలు ప్రయాణించేవి. వాణిజ్య నౌకలపై దాడులు, సిబ్బంది భద్రతా ఆందోళన కారణంగా నౌకల రవాణా దాదాపు పూర్తిగా నిలిచిపోయింది.
