- భారత్ లో శాటిలైట్ సేవలపై ఎలాన్ మాస్క్..
- భారత ప్రభుత్వం ప్రోత్సాహమిస్తోంది..
భారత్లో తమ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన అనుమతులను ప్రభుత్వం నిలిపివేసిందంటూ వస్తున్న వార్తలను ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘స్టార్లింక్’ సంస్థ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, భారత ప్రభుత్వంతో తమ చర్చలు చురుగ్గా, ఫలవంతంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. తమ విస్తరణ ప్రణాళికలపై ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకరమైన స్పందన వస్తోందని కంపెనీ ఉపాధ్యక్షురాలు లారెన్ డ్రేయర్ తెలిపారు.
ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ, ఇరాన్ వివాదంలో స్టార్లింక్ టెర్మినల్స్ వినియోగంపై ఉన్న ఆందోళనల కారణంగా భారత ప్రభుత్వం స్టార్లింక్ వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులను నిలిపివేసిందని ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ నివేదిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో స్టార్లింక్ దీనిపై స్పందించింది.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ లో లారెన్ డ్రేయర్ ఒక ప్రకటన విడుదల చేశారు. “గుర్తు తెలియని వర్గాల నుంచి వచ్చిన నిరాధారమైన ఆరోపణలతో కూడిన తప్పుదోవ పట్టించే కథనాలకు విరుద్ధంగా, స్టార్లింక్ భారత ప్రభుత్వంతో చురుకైన, ఫలవంతమైన చర్చలు జరుపుతోంది” అని ఆమె పేర్కొన్నారు. తాము అన్ని నియంత్రణ, భద్రతాపరమైన అవసరాలను పాటిస్తున్నామని, ప్రభుత్వంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని ఆమె వివరించారు.
