- నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక
- రౌడీషీటర్లకు నార్కోటిక్ డ్రగ్ పరీక్షలు
మంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్లకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్,ఎస్ఐ సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నివారణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఐ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లకు భవిష్యత్తులో ఎటువంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనరాదని,ప్రజల్లో భయాందోళనలు కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ మంచి పౌరులుగా జీవించాలని సూచించారు.

మాదకద్రవ్యాల వినియోగ నియంత్రణలో భాగంగా వారిని ప్రభుత్వ ఆసుపత్రి మంచిర్యాలకు తరలించి యూరిన్ నార్కోటిక్ డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. నిర్వహించిన పరీక్షల్లో అందరికీ నెగటివ్ ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన,నేరాల నియంత్రణ కోసం పోలీస్ శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని, అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
