- అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నారంటూ కనకరాజు ఆరోపణ
తనపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్న పెద్దపల్లి సీఐ కె. ప్రవీణ్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా వాసి కుక్క కనకరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తనకు ఎదురైన పరిణామాలను వివరించారు.
తాను ఓ ఫ్లాట్ కొనుగోలు విషయంలో చెలకల శ్రీనివాస్, మరికొందరు వ్యక్తుల నుంచి కులం పేరుతో దూషణలు, హత్య బెదిరింపులు ఎదుర్కొన్నానని కనకరాజు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నెల రోజులపాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. సీఐ ప్రవీణ్ పలుమార్లు తనను పిలిపించి రాజీ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని, తన మాట వినకపోతే తనపైనే కేసులు పెడతానని బెదిరించారని పేర్కొన్నారు.
విధిలేని పరిస్థితుల్లో కుల సంఘాలను ఆశ్రయించగా, వారు తనకు మద్దతుగా నిలిచి కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేపట్టారని తెలిపారు. దీంతో పోలీసులు శ్రీనివాస్, మరికొందరిపై కేసు నమోదు చేశారని చెప్పారు.Justice
అనంతరం తనపై కక్ష పెంచుకున్న సీఐ ప్రవీణ్.. నెల రోజుల క్రితం వెంచర్ వద్ద మరికొందరితో కలిసి దాడికి పాల్పడ్డానంటూ తనను కులం పేరుతో దూషించిన వ్యక్తితో ఫిర్యాదు ఇప్పించి శనివారం తనపై కేసు నమోదు చేయించారని కనకరాజు ఆరోపించారు. తనపై పీడీ యాక్టు కూడా పెడతానని మానసికంగా వేధిస్తున్నారని అన్నారు.
తాను మాదిగ సామాజికవర్గానికి చెందినవాడిననే కారణంతోనే సీఐ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనపై నమోదైన కేసును రద్దు చేసి, సీఐ ప్రవీణ్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
న్యాయం జరగకపోతే రాష్ట్ర, జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయిస్తానని కనకరాజు తెలిపారు. తనకు న్యాయం జరిగేలా మీడియా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొంకూరి నరేందర్, నెత్తుట్ల వెంకటేష్, అశోక్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
