- ఇది భారతదేశానికి లభించిన గౌరవం..
- మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్న నీలకంఠ్..
- అంతర్జాతీయ ఆర్ధిక విధానాల్లో కీలక బాధ్యతలు..
భారత ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖ నిపుణుడు నీలకంఠ్ మిశ్రా ప్రతిష్టాత్మకమైన ప్రపంచ బ్యాంక్ (వరల్డ్ బ్యాంక్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గల ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నియామకాల కమిటీ అధికారిక ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. నీలకంఠ్ మిశ్రా ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.
ఈ కీలకమైన పదవి ద్వారా నీలకంఠ్ మిశ్రా ప్రపంచ బ్యాంక్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడమే కాకుండా.. అంతర్జాతీయ ఆర్థిక విధానాల రూపకల్పనలో, గ్లోబల్ డెవలప్మెంట్ కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించనున్నారు. నీలకంఠ్ మిశ్రా బాధ్యతలు స్వీకరించే వరకు ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ పదవీ కాలాన్ని జూన్ 19, 2026 తర్వాతి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
