- వెల్లడించిన మంత్రి నారా లోకేష్..
- విదేశాలకు ఆంధ్రా టీచర్స్..
దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలన్నది నా ధ్యేయం. అందుకు అనుగుణంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నాను. అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులపై అధ్యయనానికి ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నాం. అక్కడ వారు తెలుసుకున్న మంచి బోధనాపద్ధతులను రాష్ట్రంలో అమలు చేస్తాం” అని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
అమరావతి సచివాలయంలో రాష్ట్రవ్యాప్తంగా డీఈవోలు, ఏపీసీలతో(అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్) మంత్రి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, క్వాలిటీ మెరుగుపర్చకపోతే నష్టపోయేది పిల్లలే అన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థ ఓపెన్ మార్కెట్ తో పోటీపడాలన్నారు. ఇందుకోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వరల్డ్ క్లాస్ బెస్ట్ మోడల్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ తన లక్ష్యమని, ఇందుకోసం అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
