- కేసును ఛేదించిన హైదరాబాద్ పోలీసులు..
- ఎనిమిది మంది అరెస్ట్. కొనసాగుతున్న కేసు దర్యాప్తు..
హైదరాబాద్లో అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్లో కలకలం రేపిన రిచ్ కిడ్స్ ట్రాప్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా సంపన్న కుటుంబాలకు చెందిన యువతులను, మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న కింగ్పిన్ అర్జున్ అలియాస్ ఆజాద్, అతని సోదరుడు రాజీవ్, తల్లి, మామతో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్ స్టైల్ను ఎరగా చూపి ఈ ముఠా సాగిస్తున్న అరాచకాలు విచారణలో వెలుగు చూసి విస్తుగొలుపుతున్నాయి.
అర్జున్, ఇన్స్టాగ్రామ్లో తాను కూడా ఒక కోటీశ్వరుడి లా ఫోజులు కొట్టేవాడు. ఖరీదైన బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్ల ఫోటోలు, హై-ప్రొఫైల్ పబ్బుల్లో పార్టీల వీడియోలను పోస్ట్ చేస్తూ యువతులను ఆకర్షించేవాడు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలను, ఒంటరిగా ఉండే సంపన్న యువతులను టార్గెట్ చేసేవాడు. ప్రేమ పేరుతో వలవేసి, వారిని నమ్మించి విలాసవంతమైన ప్రదేశాలకు తీసుకెళ్లి, అతి సాన్నిహిత్యంగా ఉంటూ ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసేవాడు.
ఈ ముఠా కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, బాధితుల ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు, వాచ్మెన్లతో కూడా స్నేహం చేసేది. వారి ద్వారా ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, పిల్లల కదలికలను సేకరించేది. ఒక పారిశ్రామికవేత్త కుమార్తెను ట్రాప్ చేసిన అర్జున్, ఆమె డ్రైవర్ ఫోన్ ద్వారానే సంభాషణలు సాగించి, ఆ తర్వాత రికార్డ్ చేసిన వీడియోలతో బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారంలో అర్జున్ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తూ, బాధితులను భయభ్రాంతులకు గురిచేసి లక్షల రూపాయలు వసూలు చేసేవారు.
