మైలార్ దేవ్ పల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి.స్వర్ణ కుమారి మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను , సిబ్బంది హాజరు పట్టికను ,హాస్పిటల్ లోని బెడ్లను , మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ లను హాస్పిటల్ ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించారు. గర్భిణీలకు సరైన వైద్య సేవలు అందుతున్నాయా అని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు, అన్ని రకాల వైద్య సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలని ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా క్లీనిక్ ఏర్పాటు చేయాలని అలాగే మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, రక్తహీనత ఉన్నవారికి సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వారు వేచి ఉండే ప్రాంతంలో కూర్చునే ఏర్పాట్లు, త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని తెలిపారు.
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు చేరుకోవాలని, వైద్యులు, సిబ్బంది ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సేవా భావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
