- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
వరి ధాన్యం నిల్వచేసే గోదాముల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలం గుండ్లపహాడ్, బెల్లంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం నిల్వ గోదాములను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, బెల్లంపల్లి తహసిల్దార్ కృష్ణ లతో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు నగదు చెల్లింపు త్వరగా పూర్తి చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు పూర్తి చేయాలని తెలిపారు.
కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి తీసుకున్న ధాన్యాన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గోదాములలో నిబంధనల ప్రకారం నిల్వ చేయాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 రైస్ మిల్లులు పని చేస్తున్నాయని, సుముఖ్ గోదాం సామర్థ్యం 20 వేల మెట్రిక్ టన్నులు ఉండగా, ఇతర గోదాముల సామర్థ్యం మొత్తం 61 వేల మెట్రిక్ టన్నులుగా ఉందని తెలిపారు.

ఈ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగిస్తూ నిల్వలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో మిల్లింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రవాణా వాహనాలను మిల్లులకు తగిన విధంగా కేటాయించి, వరి ధాన్యం రవాణా, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అంతరాయాలు రాకుండా, హమాలి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు.
అనంతరం బెల్లంపల్లి మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి భూభారతి రెవెన్యూ దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. భూ సమస్యల పరిష్కారం లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులతో సరిచూసి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యాలయ అధికారులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
