సిద్దిపేట జిల్లా(Siddipet District) గజ్వేల్లో బీజేపీ(Bjp) మునిసిపల్ ఎన్నికల(Municipal Elections) విజయ సంకల్ప సమావేశం(Vijaya Sankalpa Meeting) నిర్వహించింది. త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ పరిధిలోని గజ్వేల్ నియోజకవర్గం, గజ్వేల్ మునిసిపాలిటీలో ఎన్నికల సమర శంఖారావాన్ని మెదక్ ఎంపీ(Medak Mp) రఘునందన్ రావు(RaghunandanRao) మంగళవారం పూరించారు. ఈ సందర్భంగా దాదాపు 500 బైకులతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన మీటింగ్లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సమావేశంలో గజ్వేల్ మునిసిపాలిటీ ఇన్ఛార్జ్ ఆకుల విజయ, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మునిసిపాలిటీ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గజ్వేల్లో కాంగ్రెస్కు 9184 ఓట్లు, బీజేపీకి 10404 ఓట్లు, బీఆర్ఎస్కి 10,820 ఓట్లు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ గజ్వేల్లో మెజారిటీ సాధించలేకపోయిందని ఎద్దేవా చేశారు.
‘దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న మూడేళ్లలో నేనెప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉన్నా. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ 13 ఏళ్లలో కనీసం 10 సార్లు కూడా గజ్వేల్కు రాలేదు. గజ్వేల్ మునిసిపాలిటీని నూటికి నూరు శాతం బీజేపీ కైవసం చేసుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది. దేశమంతటా బీజేపీ పార్టీ విజయ పథంలో దూసుకుపోతోంది. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఇప్పటికీ రింగ్ రోడ్డు పూర్తి చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు గజ్వేల్ ప్రజలకు అందలేదు.
గజ్వేల్లో నిర్మించిన ఆసుపత్రిలో స్థానికులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. సమీకృత మార్కెట్ నిర్మాణం వల్ల ప్రయోజనంలేక ప్రజలు రోడ్లపైనే దుకాణాలు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మల్లన్న సాగర్ బాధితులకు రూ.240 కోట్లు ఇస్తామన్న హామీ ఇప్పటికీ అమలుకాలేదు. మల్లన్న సాగర్ బాధితులు గజ్వేల్ మునిసిపాలిటీలో విలీనం అయినప్పటికీ కొత్త వార్డులు పెంచలేదు. భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా ఎదగాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారు’ అని రఘునందన్ రావు చెప్పారు.
