- ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో నిర్వహణ..
- వైద్యపరీక్షలు, మందులు ఉచితం
- శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు
ఐసీఎంఆర్–జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) ఆధ్వర్యంలో నేడు అడ్డగుట్టలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ జరిగింది. డా. జగ్జీవన్ బాబు గెడ్డం, డా. సమర్సింహా రెడ్డి, డా. కార్తికేయన్ రామానుజం, డా. రాఘవేంద్ర పాండురంగి, డా. సూర్య గౌడ్, డా. శంకర్ నాయక్లతో పాటు సాంకేతిక, ప్రాజెక్టు సిబ్బంది పాల్గొని ఉచిత ఆరోగ్య పరీక్షలు, వైద్యంతో పాటు మందులు అందచేశారు. ఈ వైద్య శిబిరంలో స్థానిక ప్రజలకు జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, శరీర నొప్పులు, ఇతర స్వల్ప ఆరోగ్య సమస్యల కోసం వైద్య పరీక్షలు, రోగుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, నాడి స్పందన వంటి ముఖ్యమైన జీవ సూచికలతో పాటు సమగ్ర శారీరక పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.


రక్తపోటు, మధుమేహ పరీక్షలు, దంత ఆరోగ్యం, సమతుల్య ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన కల్పిస్తూ సలహాలు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలకు నివారణాత్మక ఆరోగ్య సేవలు అందడంతో పాటు సాధారణ ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం లభించింది. సమాజ ఆరోగ్యాభివృద్ధి కోసం ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలనే ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ యొక్క నిరంతర నిబద్ధతకు ఈ వైద్య శిబిరం నిదర్శనంగా నిలిచిందని వారు వెల్లడించారు.
