- అనుమానంతో నిలదీసిన యువతీ..
- ప్రయాణికుల భద్రతపై నీలి నీడలు..
హైదరాబాద్లోని చారిత్రక చార్మినార్ సమీపంలో ఓ యువతి పట్ల నకిలీ రాపిడో డ్రైవర్ అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న యువతిని లక్ష్యంగా చేసుకున్న ఆగంతకుడి బండారాన్ని ఆమె తన సమయస్ఫూర్తితో బయటపెట్టింది. ఈ ఘటన ప్రయాణికుల భద్రతపై మరోసారి చర్చను రేకెత్తించింది.
కంటెంట్ క్రియేటర్ సిద్ధేశ్వరి సుగంత్ రాత్రి 9 గంటల సమయంలో చార్మినార్ వద్ద ఆటో కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో స్కూటర్పై వచ్చిన ఓ వ్యక్తి, “ఎక్కడికి వెళ్లాలి? రాపిడో కావాలా మేడమ్?” అని అడిగాడు. అయితే, అతడి స్కూటర్కు నంబర్ ప్లేట్ లేకపోవడం, అతడి వద్ద డ్రైవర్ ఐడీ కార్డు కూడా లేకపోవడాన్ని సిద్ధేశ్వరి గమనించింది.
సందేహం రావడంతో ఐడీ కార్డు చూపించాలని ఆమె గట్టిగా నిలదీసింది. దీంతో కంగారుపడిన ఆ వ్యక్తి, ఆమె ముందే ప్లే స్టోర్ నుంచి రాపిడో యాప్ను డౌన్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో అతడు నకిలీ డ్రైవర్ అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. వాహనం స్టార్ట్ కావడం లేదంటూ అతడు మాట దాటవేసే ప్రయత్నం చేశాడు. దీంతో అతడి ఫోన్ను పరిశీలించగా యాప్ అప్పుడే లాగిన్ అవుతూ ఓటీపీ పేజీలో ఉంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె “మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో” అని గట్టిగా హెచ్చరించింది.
ఎలాంటి బుకింగ్, వెరిఫికేషన్ లేకుండా ఇంత ధైర్యంగా ఒక వ్యక్తి బైక్ ఎక్కమనడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సిద్ధేశ్వరి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోను పంచుకోవడం ద్వారా ప్రయాణికులను అప్రమత్తం చేయడమే తన ఉద్దేశమని తెలిపింది.
