- ప్రీతీపై సర్వత్రా వెల్లువెత్తుతున్న అభినందనలు..
- 5-0 తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న ప్రీతి..
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్ ప్రీతి సత్తా చాటింది. మహిళల 54 కేజీల బాక్సింగ్ విభాగంలో ఫైనల్లో కెనడాకు చెందిన ఎస్.ఎస్. డెల్గాడోను చిత్తు చేసి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఏకపక్షంగా సాగిన ఈ తుదిపోరులో ప్రీతి 5-0తో అద్భుత విజయాన్ని అందుకుంది.
పోటీ ప్రారంభమైనప్పటి నుంచే ప్రీతి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తన పదునైన పంచ్లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మూడు రౌండ్లలోనూ ఐదుగురు జడ్జీలు ప్రీతికే 10-9 చొప్పున పాయింట్లు కేటాయించడం ఆమె ఆధిపత్యానికి నిదర్శనం. ఈ క్రమంలో కెనడా బాక్సర్ను ఒకసారి నాక్డౌన్ కూడా చేసింది. అద్భుతమైన ఫుట్వర్క్, పదునైన కాంబినేషన్లతో వ్యూహాత్మకంగా ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది.
ఈ స్వర్ణ పతకంతో గ్లాస్గో గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 24కి చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ 9వ స్థానానికి ఎగబాకింది. బాక్సింగ్లో భారత క్రీడాకారులు నిలకడగా రాణిస్తుండగా, ప్రీతి విజయం దేశానికి మరో గర్వకారణంగా నిలిచింది.
