HomeతెలంగాణHyderabad Metro | మెట్రో ప్రయాణీకులకు గుడ్ న్యూస్..

Hyderabad Metro | మెట్రో ప్రయాణీకులకు గుడ్ న్యూస్..

  • అదనపు కోచ్ లను ఏర్పాటు..
  • ప్రకటించిన హెచ్ఎంఆర్ఎల్..

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ శుభవార్త అందించింది. నగరంలో మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు ఫేజ్-1 నెట్‌వర్క్‌లో అదనపు కోచ్‌లను చేర్చాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో ప్రయాణికులకు వెసులుబాటు కల్పించేలా ఈ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర ఉన్న ఫేజ్-1 కారిడార్‌లో మూడు కోచ్‌లతో కూడిన రైళ్లు నడుస్తున్నాయి.

అయితే, ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈ కోచ్‌లు సరిపోవడం లేదు. అమీర్‌పేట్, మియాపూర్, రాయదుర్గం, హైటెక్ సిటీ వంటి కీలక స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, కొత్త కోచ్‌ల కొనుగోలు నిమిత్తం తయారీదారులతో వెంటనే చర్చలు ప్రారంభించాలని హెచ్ఎంఆర్ఎల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి బుధవారం అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ప్రయాణికుల సేవలు, మౌలిక వసతులపై జరిపిన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కోచ్‌ల పెంపుతో పాటు స్టేషన్ల వెలుపల రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంపై అధికారులు దృష్టి సారించారు. ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం టీఎస్‌ఆర్టీసీ, రవాణా శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే, పాదచారుల రాకపోకలను సులభతరం చేయడం, మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా ఉన్న స్కైవాక్‌ల నిర్వహణ, రద్దీ నియంత్రణకు వినూత్న వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించారు.

ప్రయాణికులకు మెరుగైన సేవలు, భద్రతతో పాటు స్టేషన్ల పరిశుభ్రతకు తమ మొదటి ప్రాధాన్యత ఉంటుందని హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ తెలిపారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ హబ్స్‌లను కలుపుతూ పబ్లిక్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏర్పాటు ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News