- సాయికృష్ణ కేసులో స్పందించిన సీఎం..
- అన్నివిధాలా ఆదుకుంటామని కుటుంబసభ్యులకు హామీ..
విజయవాడలో సంచలనం సృష్టించిన యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సాయికృష్ణ కుటుంబాన్ని శుక్రవారం ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పరామర్శించి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కేసుపై ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణ జరుగుతోందని, దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు ఇవాళ స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లారు.
ఆయనను కలిసి తమ ఆవేదనను విన్నవించుకున్నారు. వారి గోడును ఓపికగా విన్న ముఖ్యమంత్రి, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మే 9న ఒక కేసు విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను తీసుకెళ్లారని, అప్పటి నుంచి అతని ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది కస్టోడియల్ డెత్ అయి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, సాయికృష్ణ అదృశ్యమయ్యాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన ప్రభుత్వం, కృష్ణలంక సీఐ నాగార్జును సస్పెండ్ చేసింది. సింగపూర్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే చంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సీఎస్, డీజీపీలతో సమీక్ష నిర్వహించి, నిష్పాక్షిక విచారణకు సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించారు. మరోవైపు, ఈ కేసుపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ను హైకోర్టు విచారిస్తుండగా, తదుపరి విచారణ జూన్ 29కి వాయిదా పడింది.
