- ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపుతాయి..
- రాత్రిపూట అసలు తినకూడదని హెచ్చరిక..
అర్ధరాత్రి ఆకలి వేయగానే చాలామంది వెంటనే ఇన్స్టంట్ నూడుల్స్ వైపు మొగ్గు చూపుతారు. కేవలం కొన్ని నిమిషాల్లో తయారయ్యే ఈ ఆహారం తాత్కాలికంగా ఆకలిని తీర్చినా, ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తరచూ ఇన్స్టంట్ నూడుల్స్ తినడం గుండె ఆరోగ్యం, రక్తపోటు, నిద్ర, జీవక్రియలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఇన్స్టంట్ నూడుల్స్లో ప్రధానంగా అధిక మొత్తంలో సోడియం (ఉప్పు) ఉంటుంది.
ఒక ప్యాకెట్ నూడుల్స్లో సుమారు 800 నుంచి 1,200 మిల్లీగ్రాముల వరకు సోడియం ఉండే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 2వేల మిల్లీగ్రాముల కంటే తక్కువ సోడియం మాత్రమే తీసుకోవాలి. అంటే ఒక్క బౌల్ నూడుల్స్తోనే రోజువారీ పరిమితికి సగానికి పైగా చేరుకునే అవకాశం ఉంటుంది. సోడియం అధికంగా తీసుకున్నప్పుడు శరీరంలో నీరు నిల్వ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగి గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది.
ఫలితంగా రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే అధిక రక్తపోటు లేదా గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. నిపుణుల ప్రకారం సమస్య కేవలం నూడుల్స్ తినడంలోనే కాదు, వాటిని రాత్రి ఆలస్యంగా తినడంలో కూడా ఉంటుంది. సాధారణంగా రాత్రి సమయంలో శరీరంలోని రక్తపోటు సహజంగా కొంత తగ్గుతుంది. దీనివల్ల గుండె, రక్తనాళాలకు విశ్రాంతి లభిస్తుంది.
అయితే అధిక సోడియం కలిగిన ఆహారాన్ని రాత్రి వేళల్లో తీసుకుంటే ఈ సహజ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. అదే సమయంలో మూత్రపిండాలు (కిడ్నీలు) రాత్రి వేళల్లో కొంత నెమ్మదిగా పనిచేస్తాయి. ఫలితంగా శరీరంలోకి చేరిన అదనపు సోడియాన్ని బయటకు పంపేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో రక్తపోటుపై ప్రభావం ఎక్కువసేపు కొనసాగుతుంది.
