- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని..
- నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన రమేష్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ అసెంబ్లీలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జనసేన పార్టీ తరపున రాజ్యసభ రేసులోకి ఒక అభ్యర్థి అధికారికంగా ఎంట్రీ ఇవ్వనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నామినేషన్ ప్రక్రియ అధికార ఎన్డీఏ కూటమిలోని మూడు భాగస్వామ్య పార్టీల మధ్య ఉన్న బలమైన ఐక్యతను స్పష్టం చేసింది. లింగమనేని రమేష్ నామినేషన్ను సమర్థిస్తూ ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు.
నామినేషన్ దాఖలు చేసే సమయంలో కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా పెద్ద సంఖ్యలో అసెంబ్లీకి తరలివచ్చారు. వీరిలో నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, బొలిశెట్టి శ్రీనివాస్ నాయక్, వంశీకృష్ణ శ్రీనివాస్, పులపర్తి రామాంజనేయులు, దేవా వరప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, బీజేపీ ప్రతినిధి ఎన్. ఈశ్వర్ రావు తదితరులు ఉన్నారు. మరోవైపు, మిగిలిన మూడు రాజ్యసభ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. టీడీపీ అభ్యర్థుల పేర్లు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది..
