భారతీయ జనతా యువమోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, నల్గొండ జిల్లాకు చెందిన చింతకాయల ఝాన్సీ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్ అధికారికంగా ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఉన్నత విద్యాభ్యాసం, సుదీర్ఘ అనుభవం
నల్గొండ జిల్లా అనుముల మండలం శ్రీనాథపురం-అంబటిపల్లి గ్రామానికి చెందిన మణెమ్మ, శ్రీనివాస్ దంపతుల కుమార్తె ఝాన్సీ. ఆమె ఎల్.ఎల్.ఎం పూర్తి చేసి, ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఝాన్సీ.. గతంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్య సమితి సభ్యురాలిగా చురుకైన పాత్ర పోషించారు.
ప్రజా సమస్యలకై నిరంతర పోరాటం
తన నియామకం పట్ల ఝాన్సీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన బీజేపీ, బీజేవైఎం రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇంతటి గుర్తింపు రావడానికి ప్రధాన కారణమైన ఏబీవీపీ నాయకులకు, తోటి కార్యకర్తలకు ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
