- భారతదేశానికి మామిడికి ప్రత్యేకమైన స్థానం..
- ఇక్కడి మామిడి పళ్లకు ప్రపంచ గుర్తింపు..
వేసవి వచ్చిందంటే చాలు.. నోరూరించే మామిడి పండ్ల కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. పండ్లలో రాజుగా పిలిచే మామిడికి మన దేశంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఈ పండు సాగవుతున్నప్పటికీ, భారత్లోని ఓ చిన్న పట్టణం మాత్రం తన శతాబ్దాల చరిత్రతో అద్భుతమైన తోటలతో ‘ప్రపంచ మామిడి రాజధాని’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే ఉత్తరప్రదేశ్లోని మలిహాబాద్.
లక్నోకు సమీపంలో ఉండే మలిహాబాద్ పట్టణానికి మామిడి సాగులో ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. నవాబుల కాలం నుంచే ఇక్కడ మామిడి తోటల పెంపకం ఒక సంప్రదాయంగా సాగుతోంది. ఇక్కడి సారవంతమైన నేలలు, అనుకూలమైన వాతావరణం వల్ల అత్యంత నాణ్యమైన, రుచికరమైన మామిడి పండ్లు ఇక్కడ పండుతాయి. మలిహాబాద్లో పండే మామిడికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ భారీ డిమాండ్ ఉంది.
మలిహాబాద్ మామిడి పండ్లు అనగానే గుర్తొచ్చేది వాటి తియ్యదనం, అద్భుతమైన సువాసన, పీచు లేని మెత్తటి గుజ్జు. ఇక్కడ ఎన్నో రకాల మామిడి పండ్లు పండుతున్నప్పటికీ అన్నింటికంటే ‘దశేరి’ రకం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ రకానికి చెందిన సుమారు 200 ఏళ్ల నాటి ‘మదర్ ట్రీ’ ఇప్పటికీ ఈ ప్రాంతంలో సజీవంగా ఉండటం విశేషం.
